హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ ముగ్గురు నిందితుల దర్యాప్తుపై కోర్టు స్టే ఎత్తేసింది. బీజేపీ పిటిషన్ను కోర్టు పెండింగ్లో పెట్టింది. పిటిషన్పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్లను రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలతో మోయినాబాద్ ఫాం హౌస్లో 26వ తేదీ రాత్రి రామచంద్ర భారత అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజీ, నంద కుమార్లను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపుర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులను పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టారని పోలీసులు తెలిపారు.