హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అందజేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. 2021 జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ దాఖలు చేసిన పిటిషన్ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేస్తూ తీర్పు చెప్పారు.
దీనిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. భూసేకరణ గెజిట్ జారీకి సంబంధించిన లేఖను సమర్పించాలని ఈ నెల 5న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేకపోయామని, మరోసారి గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ నెల 16న జరిగే విచారణలోగా సమర్పించాలని, లేనిపక్షంలో సిద్దిపేట కలెక్టర్ స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.