హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ రోగుల చికిత్స మినహా ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుత భవనాన్ని వాడుకోవడం సురక్షితం కాదని, దవాఖాన కోసం అస్సలు వినియోగించరాదని తేల్చి చెప్పింది. మరమ్మతులు చేస్తే భవన వినియోగ కాల పరిమితి పెరుగుతుందని, అయితే, అప్పుడు కూడా దవాఖాన కోసం వినియోగించడం సబబు కాదని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఉస్మానియా దవాఖాన భవనాన్ని పరిశీలించి సిఫార్సులు చేసిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలియజేశారు. ఉస్మానియాకు మరమ్మతులు చేయడం వల్ల భవన జీవనకాలం పెరిగి దవాఖాన మినహా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చునని నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు.
ఉస్మానియా దవాఖాన భవనాన్ని కూల్చి తిరిగి నూతన భవనాలు నిర్మించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కొందరు, వారసత్వ కట్టడాల జాబితాలోని ఆ భవనాన్ని కూల్చరాదని, మరమ్మతులు చేసి తిరిగి వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఇంకొందరు పరస్పర విరుద్ధంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. నిపుణుల కమిటీ సిఫార్సులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు గడువు కావాలని ఏజీ కోరడంతో విచారణను ఆగస్టు 25కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్స్ విచారణ సందర్భంగా హైకోర్టు గతంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలు, జీహెచ్ ఎంసీ సిటీప్లానర్ వంటి ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. వరంగల్ ఎన్ఐటీ నిపుణుల సాయంతో భవనానికి గత మార్చి 19న పరిశీలన, పరీక్షలు నిర్వహించింది. తర్వాత కమిటీలో స్వతంత్ర వ్యక్తులను చేర్చాలని హైకోర్టు నిర్ణయించింది. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్, ఆరియాలజీ ఆఫ్ ఇండియా ఎస్ఈ, స్టెడ్రంట్ టెక్నోక్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకూ కమిటీలో చోటు కల్పించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చినట్టు ఏజీ తెలిపారు.
‘ఉస్మానియా దవాఖాన వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నది. ఆరిటెక్ పర్యవేక్షణలో మరమ్మతులు చేస్తే భవన వినియోగ ప్రమాణాలు మెరుగుపడతాయి. భవనం జీవితకాలం పెరిగినా అందులో దవాఖాన కొనసాగింపు సబబుకాదు. హాస్పిటల్నే కొనసాగించాలంటే చాలా పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేయాలి. గ్యాస్, ఏసీ, ఆక్సిజన్, నీరు, మురుగు, డ్రెనేజీ, ఇతర పైపులైన్లు వేస్తే వారసత్వ కట్టడానికి ముప్పు ఉంటుంది’ అని నిపుణుల కమిటీ నివేదికలో పేరొన్నట్టు ఏజీ చెప్పారు.