Director Shankar | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, ఒక్కో అవసరానికి ఒక్కో విధానం ఉటుందని అభిప్రాయపడింది. సినీ రంగానికి, క్రీడాకారులకు భూములను కేటాయిస్తుందని, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంటుందని పేర్కొన్నది. ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, హజారికాకు ఆయా ప్రభుత్వాలు భూములు ఇచ్చాయని గుర్తు చేసింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్లా గ్రామంలో సర్వే నం.8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను శంకర్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన జే శంకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 7న తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, సినీ పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలోనే దర్శకుడు శంకర్కు భూమి కేటాయింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా భూమి కేటాయించామని చెప్పారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి వాది స్తూ సినిమాల నిర్మాణాలు స్టూడియోల్లో జరగడం లేదని, అవుట్డోర్లోనే జరుగుతున్నాయని చెప్పారు. శంకర్ తరఫు సీనియర్ న్యా యవాది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ ప్రతిభ ఉండి ఆర్థికస్థోమత లేకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.