BJP | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వివరాలను పోలీసులకు అందజేయాలని పిటిషనర్ను ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదని షరతులు విధించింది.
ఈ షరతులను ఉల్లంఘిస్తే పిటిషనర్లపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుందని జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వ న్యాయవాది ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. ఇందిరాపార్ వద్ద దవాఖానలు, నివాస ప్రాంతాలు ఉన్నాయని, ధర్నా వల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిందని, ధర్నా పేరుతో నిరుద్యోగులను రెచ్చగొడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తెలిపారు.