హైదరాబాద్, ఏప్రిల్ 4 : కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) విభాగం, తెలంగాణ ఆరోగ్యస్థితిపై ప్రచురించిన గణాంక సంకలనాన్ని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రౌండ్-4 (2015-16) రౌండ్-5 (2019-20) ఆధారంగా తెలంగాణలో ఆరోగ్యం, జనాభా స్థితిపై సమగ్ర గణాంకాలతో ఈ సంకలనం రూపొందించారు. ఈ సమాచారం ప్రణాళిక విభాగానికి ఎంతగానో దోహదం చేయనున్నదని రామకృష్ణారావు చెప్పారు. ప్రతి జిల్లా జనాభా, ప్రజల ఆరోగ్యస్థితి సూచికలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్డీ హైదరాబాద్ ఇంచార్జి రీజినల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుజిత్కుమార్ మిశ్రా, రిసర్చ్ అసోసియేట్ మహ్మద్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.