సిద్దిపేట, ఏప్రిల్ 6: ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ‘రుతు ప్రేమ’ కార్యక్రమం దోహదపడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 5వ వార్డులో రాష్ట్రంలోనే తొలిసారిగా ‘రుతు ప్రేమ’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆడబిడ్డకు రుతుస్రావం సహజ పక్రియ అని, నేటి ఆధునికకాలంలోనూ ఆడ పిల్లలు దీనిపై బహిరంగంగా మాట్లాడటం లేదని అన్నారు. రసాయన డైపర్లకు బదులు క్లాత్ప్యాడ్లు వాడాలని సూచించారు. ఆరోగ్యమంత్రిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. దీనిపై బహిరంగ చర్చ జరగడం మహిళల చైతన్యానికి తొలి విజయం అన్నారు. ఇదే స్ఫూర్తితో మహిళా సంఘాలు, వైద్యులు క్లాత్ ప్యాడ్ల వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులరాజనర్సు, కమిషనర్ రవీందర్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అచ్చే దిన్ నహీ…సచ్చే దిన్ ఆయా
బీజేపీ పాలనలో మళ్లీ కట్టెల పొయ్యిలు
కేంద్రంలోని మోదీ పాలనలో ‘అచ్చే దిన్ నహీ.. సచ్చే దిన్ ఆయా’ అని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి ఆలోచిస్తుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం ఎడాపెడా పన్నులు వేస్తూ, ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి, సబ్సిడీ ఎత్తివేయడంతో ప్రజలు ఎప్పుడో మర్చిపోయిన కట్టెల పొయ్యి, ఉనుక పొయ్యిలు మళ్లీ వాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో పర్యటించిన మంత్రి, అంగడి బజార్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్రం 16 రోజుల్లో 13 సార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి అందరిపై భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాధారమైన వ్యవసాయంపై భారం పడుతున్నదని పేర్కొన్నారు. గతంలో ఎకరా దున్నకానికి రూ.2 వేలు ఖర్చయితే, ప్రస్తుతం రూ.6 వేలకు పెరిగిందని తెలిపారు. కేంద్రం వడ్ల కొనుగోలు విషయంలో తొండాట ఆడుతున్నదని, రైతుల సంక్షేమం కోసం ఎల్లప్పుడు ఆలోచించేది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.