JN.1 | హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకు అన్ని చర్యలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిని సిద్ధంగా ఉంచాలని, వీలైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి దామోదర వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి , డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.