హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): అటవీ భూములను సాగు చేసుకొనే రైతులకు పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
సీజే ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ప్రభుత్వ న్యాయవాది వాదనల తర్వాత హైకోర్టు.. పోడు భూముల వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలు పాటించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. కేంద్రంతోపాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.