హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమనగల్ కాంగ్రెస్ నేత, ఎంపీపీ పంతు నాయక్ హత్య కేసులో నిందితుడు, మావోయిస్టు నేత దారగోని శ్రీను విక్రమ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు పూచీకత్తు సమర్పించాలని, నెలలో ప్రతి మొదటి ఆదివారం అమనగల్ పోలీసుస్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది.
ఎంపీపీ హత్య కేసులో 2015లో కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టులో సవాల్ చేసిన అప్పీల్పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ను విక్రమ్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. పిటిషనర్ గత 11 ఏండ్లుగా జైలులో ఉన్నారని, బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.