హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వైరస్ తీవ్రత దృష్ట్యా నూతన సంవత్సరం, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు, వేడుకల్లో ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నది. మహారాష్ట్ర, ఢిల్లీలాగా రాష్ట్రంలోనూ ఆంక్షలు అమలు చేయాలని సూచించింది. కరోనా నియంత్రణపై ఏడాదిక్రితం దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కేంద్రప్రభుత్వం గత నెల 21న జారీచేసిన మార్గదర్శకాలను అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒమిక్రాన్ వేరియంట్ బ్రిటన్ తదితర దేశాలను ఉకిరిబికిరి చేస్తున్న నేపథ్యంలోఅలాంటి పరిస్థితులు మనదగ్గర రాకుండా చూడాలని కోరింది.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి వచ్చేవారికి సరిహద్దుల్లోనే స్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ మార్గదర్శకాలు అమలుచేయాలని, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో స్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కోరింది. ఎన్ని పరీక్షలు నిర్వహించారు? వాటి ఫలితాలు ఏమిటి? అన్న విషయాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన ప్రత్యేక న్యాయవాది సంతోష్కుమార్ తెలిపారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినవారికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. కోర్టు ఆదేశాలపై గురువారం ఆయన స్పందిస్తూ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడుతామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొంటున్నదని, విమానాశ్రయాల్లో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి సైతం ర్యాండమ్గా పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనేలా ముందస్తు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నాన్రిస్క్ దేశాల వారికి పరీక్షలు, బూస్టర్డోస్, పిల్లలకు వ్యాక్సినేషన్ వంటి కీలక అంశాలపై కేంద్రప్రభుత్వం స్పందించడంలేదని హరీశ్రావు అసహనం వ్యక్తంచేశారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు బూస్టర్ డోస్ వేయాలని రాష్ట్రం కోరినా సమాధానం లేదని తెలిపారు. చిన్నారులకు టీకాలు వేయడంపై నిర్ణయం తీసుకోవాలని సూచించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.