హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం రద్దు చేసింది. ఎంతో కాలంపాటు దర్యాప్తును వాయిదా వేయడం సబబు కాదని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సత్వర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది. సమగ్రంగా, లోతుగా, సత్వరమే విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ దళారులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి ప్రయత్నించిన సమయంలో పోలీసులు కుట్రను ఛేదించి వారిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి రిట్ దాఖలు చేశారు. ము గ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరు తూ రిట్ వేశారు. ఫోన్ల ట్యాపింగ్పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకో ర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ఇందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్ ప్రభాకర్ అభ్యంతరం చెప్తూ గడువు ఎకువ ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.
లోతుగా విచారణ జరుపుతాం
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు నిర్వహించేందుకు మొయినాబాద్ పోలీసులకు అనుమతి ఇస్తున్నామని, వచ్చే వాయిదా నాటికి కేసులో పురోగతిని పోలీసులు కోర్టుకు తెలుపాలని ధర్మాసనం ఆదేశించింది. ‘పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఈ కేసులో బీజేపీకి చెందిన వాళ్లు ఎవరూ నిందితులుగా లేరు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పలేం. ఈ పరిస్థితుల్లో పోలీసుల కేసు దర్యాప్తు వాయిదా వేయాలన్న గత ఉత్తర్వులను కొనసాగించలేం. దీర్ఘకాలం దర్యాప్తును ఆపలేం. అందుకే మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తున్నాం. సీఎం విలేకరుల సమావేశం నిర్వహించి తమపై ఆరోపణలు చేశారని బీజేపీ దాఖలు చేసిన రిట్పై లోతుగా విచారణ చేయాల్సి ఉన్నది. బీజేపీతోపాటు నిందితులు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లలోనూ పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలి. బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నదని పిటిషనర్ చెప్తున్నారు. అందుకు సంబంధించి అదనపు ఆధారాలు ఉంటే పిటిషనర్ నివేదించవచ్చు’ అని జస్టిస్ విజయ్సేన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
దర్యాప్తు వేగవంతం
కమల్ఫైల్స్ నిందితులపై దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలుపటంతో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తును వేగిరం చేసేపనిలో ప డ్డారు. ఏసీబీ కోర్టులో నిందితులు బెయిల్ పిటిషన్, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీనిపై బుధవారం కోర్టు నిర్ణ యం వెలువడే అవకాశాలున్నాయి. ఈ క్రమం లో మంగళవారం హైకోర్టు ఈ కేసు దర్యాప్తుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
రామచంద్రభారతిపై మరో కేసు
కమల్ఫైల్స్ కీలక నిందితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేసిన ఆరోపణలపై కేసు నమోదయ్యింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి సంబంధించిన పలు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ నకిలీ కార్డుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 420, 467, 428, 471, ఆధార్, ఇన్కం ట్యాక్స్, మోటర్ వెహికల్ యాక్ట్స్ ప్రకారం కేసులు నమోదు చేశారు.