Ganesh Chaturthi | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ నివేదించారు. ఆ నిబంధనలపై ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను బాంబే హైకోర్టు ఆమోదించిందని, సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని చెప్పారు.
ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు, పీసీబీ సవరణ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై ఈ నెల 25న విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జనాలు గతంలో తామిచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే చేయాలని ఆదేశించింది. పీవోపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్సాగర్, చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేయరాదని స్పష్టంచేసింది. కృత్రిమ నీటి వనరుల్లోనే ఆ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాదికి కూడా సహజ నీటివనరుల్లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకోవాలని పీసీబీని ఆదేశించింది. పీసీబీ రూపొందించిన నిబంధనల చట్టబద్ధతపై ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది.