హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యరంగంలో తెలంగాణ గర్వకారణమైన చరిత్రను లిఖించింది. సురక్షిత ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటమే కాకుండా 61 దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. మాతాశిశు మరణాలను నియంత్రించాలంటే గర్భందాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్యంగా ఉండటం, నిర్ణీత సమయానికి వైద్య పరీక్షలు చేయించడం, దవాఖానలో, నిపుణుల పర్యవేక్షణలో ప్రసవాలు జరగడం అత్యంత అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం వీటన్నింటినీ సుసాధ్యం చేసింది.
ఈ పథకం గర్భిణులకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా సామాజికంగా అనేక మార్పులు తెచ్చింది. 100% సురక్షిత ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రంగా నిలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా నివేదిక ప్రకారం.. సురక్షిత ప్రసవాల్లో జాతీయ సగటు 89% ఉండగా.. రాష్ట్రంలో 100% దవాఖాన ప్రసవాలు నమోదవ్వడం విశేషం. రాష్ట్రంలో ప్రతి ప్రసవం నిపుణుల పర్యవేక్షణలోనే జరిగినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ గత నెల విడుదల చేసిన ‘హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ (హెచ్ఎంఐఎస్) 2021-22 నివేదిక వెల్లడించింది.
కేసీఆర్ కిట్ వల్లే రాష్ట్రంలో 100% సురక్షిత ప్రసవాలు సాధ్యం అయ్యాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ఫలితాలు తెలంగాణను ప్రపంచపటంపై సగర్వంగా నిలబెట్టాయని ట్వీట్ చేశారు. ‘హెచ్ఎంఐఎస్ నివేదిక ప్రకారం.. 100% దవాఖాన ప్రసవాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పాలనలో మాతాశిశు ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంతాలవారికి సైతం విజయవంతంగా అందుతున్నాయి’ అని వివరించారు.
నిపుణుల పర్యవేక్షణలో జరిగే ప్రసవాల్లో మన దేశం కింది వరుసలో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. 198 దేశాల్లో 122వ ర్యాంకులో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్వో నివేదికలో తెలంగాణ మాత్రం 61 దేశాలతో కలిపి సురక్షిత ప్రసవాల రికార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు. దేశంలోనే అగ్రస్థానంలో నిలవడమే కాదు.. ప్రపంచ దేశాలతో పోటీ పడటమే ఆరోగ్య తెలంగాణ మాడల్ అని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లో భాగంగా గర్భిణులు పేరు నమోదు చేయించుకున్నప్పటి నుంచి ప్రసవం అయ్యి, శిశువుకు 9 నెలలపాటు టీకాలు అందించే వరకు అన్ని దశల్లోనూ వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉన్నది. తద్వారా ప్రతి ఒక్కరూ పురుడుకు దవాఖానకే వెళ్తున్నారని వివరించారు.