TS Assembly 2023 | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పిందని.. మరో 13 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
‘పట్టణాల్లోని పేదల కోసం ఏర్పాటు చేసిన 342 బస్తీ దవాఖానాలు చక్కని వైద్యసేవలు అందిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం కలిగిన బెడ్స్ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది. నిమ్స్లో మరో రెండు వేల పడకలను అదనంగా ఏర్పాటు చేస్తోంది. వరంగల్లో రూ.1,100 కోట్లతో రెండు వేల బెడ్స్ సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’ అని గవర్నర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 30 శాతం మాత్రమే ఉండేదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో చేపట్టిన సమర్థవంతమైన చర్యల వల్ల నేడు ప్రసవాల రేటు 61 శాతానికి పెరిగిందని చెప్పారు. అదేవిధంగా మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 గా ఉండేవని.. 2022 నాటికి 43కు తగ్గిపోయాయన్నారు. 2014లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 39గా ఉండేవని.. 2022 నాటికి ఆ సంఖ్య 21కి తగ్గిందని గవర్నర్ వివరించారు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో మూడంటే మూడు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు 16 జిల్లాల్లో మొత్తం 17 వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. వీటి ద్వారా ప్రభుత్వం రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటుగా విద్యార్థులకు వైద్యవిద్యను సమకూరుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మరో తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.