హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వానకాలం ఆరంభానికి ఇక 25 రోజులే మిగిలి ఉన్నందున సర్వేపై మోదీ సర్కార్ వెంటనే స్పందించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ సోమవారం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్కు ప్రత్యేకంగా లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపుతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ ఇప్పటికే పలు ప్రత్యేక సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. గత నెల ఢిల్లీలో నిర్వహించిన మూడో సమావేశంలో సీడబ్ల్యూసీ తెలంగాణ వాదనలతో ఏకీభవించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి, ఏపీ సర్కారుకు పలు కీలక ఆదేశాలను ఆదేశాలు జారీచేసింది.
ఎఫ్ఆర్ఎల్ లెవల్లో నీటిని నిల్వ చేయడం వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపును గుర్తించడంతోపాటు డ్రైనేజీలు, స్థానిక వాగుల్లో ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల తలెత్తే ప్రభావాలపైనా సంయుక్త సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ దిశానిర్దేశం చేసింది. అయినా ఈ సర్వే కోసం ఏపీ, పీపీఏ ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కాలపరిమితిని విధించి ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా పీపీఏతో జాయింట్ సర్వే చేయించాలని తాజా లేఖలో డిమాండ్ చేసింది.