ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లుగా నమోదైంది.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎంతటి ప్రతికూల వాతావరణం ఉన్నా.. తెలంగాణలో 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసింది. సీఎం కేసీఆర్ ముందుచూపు, మార్గదర్శనంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు అందించేలా సరఫరా వ్యవస్థలను బలోపేతం చేశారు. మొన్నటి వేసవికాలంలో అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. మార్చి 30న ఏకంగా 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేశారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి వచ్చిన గరిష్ఠ డిమాండ్ అది. దానికంటే ఒక్క తెలంగాణలోనే ఏర్పడిన గరిష్ఠ డిమాండ్ 2,335 మెగావాట్లు ఎక్కువ. అయినా నిరంతరాయ విద్యుత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర పనులు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ బుధవారం రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 8,439 మెగావాట్లు నమోదయ్యింది. ఇంతటి భారీ వర్షాలు కురిసినా.. ఎక్కడా 24 గంటల విద్యుత్తుకు ఆటంకం కలగకుండా విద్యుత్తు సంస్థల సిబ్బంది, ఉద్యోగులు కృషి చేస్తున్నారు. భారీ వర్షాలు, చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరగడం.. విద్యుత్తు వైర్లు తెగడం సంభవిస్తే.. అత్యవసర బృందాలు స్వల్ప సమయంలోనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.