హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2015 నుంచి ఎంఎంఆర్ పరిస్థితిపై పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్) – 2015-17లో తెలంగాణ ఎంఎంఆర్ 76 శాతం కాగా.. ఇటీవల వెల్లడించిన ఎస్ఆర్ఎస్ 2018-20 నాటికి ఎంఎంఆర్ 43 శాతానికి తగ్గింది.
ఈ జాబితాలో కేరళ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. 2015-17తో పోల్చితే 2018-20 నాటికి తగ్గుదల రేటును గమనిస్తే తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. ఆరేండ్లలో తెలంగాణలో ప్రసూతి మరణాల తగ్గుదల 43 శాతం నమోదైంది. 55 శాతంతో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 40 శాతం తగ్గుదల నమోదైంది. జాతీయ స్థాయిలో ఎంఎంఆర్ 122 నుంచి 97కు తగ్గగా.. తగ్గుదల రేటు 20 శాతంగా నమోదైంది. దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ ఎంఎంఆర్ తగ్గగా.. హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లో ఎంఎంఆర్ పెరిగింది. ఇందులో రెండు బీజేపీ పాలిత రాష్ర్టాలే. హర్యానాలో 98 నుంచి 110కి పెరగగా, పశ్చిమ బెంగాల్లో 94 నుంచి 103కు, ఉత్తరాఖండ్లో 89 నుంచి 103కు పెరిగింది.