Telangana Voters | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓటరు తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విడుదల చేశారు. రాష్ట్రంలో 1,58,71,493 పురుషులు, 1,58,43,339 మహిళా ఓటర్లు, 8.11లక్షల మంది 18, 19 ఏండ్ల వయసున్న ఓటర్లు ఉన్నారని వికాస్రాజ్ వెల్లడించారు. 6.10 లక్షల మంది మరణించిన వారి ఓట్లను తొలగించామని వివరించారు. ఒక ఇంట్లో ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉన్న 7.66 లక్షల కుటుంబాల వివరాలను ఎన్నికల సిబ్బంది స్వయంగా వెళ్లి తనిఖీ చేశారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ప్రచురించిన ఓటరు జాబితాలో కంటే అదనంగా 5.8 శాతం ఓటర్లు పెరిగారని వెల్లడించారు. 17,01,087 మంది కొత్తగా, 6,10,694 మంది తొలగింపు కోసం, 5,80,208 మంది వివరాల సవరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
ఓటరు జాబితాలో థర్డ్ జెండర్లు 2,557 మంది, 80 ఏండ్లకు పైబడినవారు 43,943 మంది ఉండగా, దివ్యాంగులు 5,06,493 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి గతంలో 992 ఉండగా ప్రస్తుత జాబితాతో 998కి చేరింది. 18, 19 ఏండ్ల వయసున్న వారి లింగ నిష్పత్తి 707 నుంచి 743కు పెరిగింది. ఓటరు జాబితా ప్రక్షాళన చేసేందుకు రెండేండ్లపాటు తీవ్రంగా శ్రమించామని, ప్రక్షాళనలో 14,24,694 సవరణలు జరిగాయని వెల్లడించారు. 4,15,824 మంది ఓటర్లు తమ చిరునామాలు మార్చుకున్నారని, 3,94,968 మంది ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్కు, 64,661మంది ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారారని తెలిపారు. ఓటర్ల జాబితాలో శేరిలింగంపల్లి అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో 6.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,46,016.
నామినేషన్ దాఖలుకు 10 రోజుల ముందు వరకు
ఓట్ల నమోదు కోసం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్కు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్రాజ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://voters.eci.gov.in/ వెబ్సైట్, బీఎల్వోల ద్వారా, ఓటరు హెల్ప్లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
తగ్గిన అంతరం
2018తో పోల్చితే ప్రస్తుతం పురుష, స్త్రీ ఓటర్ల మధ్య అంతరం గణనీయంగా తగ్గింది. 2018లో పురుష ఓటర్లు 1,41,56,182 మంది ఉండగా, స్త్రీలు 1,39,05,811 మంది ఉన్నారు. ఇద్దరి మధ్య 2,50,371 ఓటర్ల అంతరం ఉండగా, తాజా జాబితా ప్రకారం అంతరం 28,184 మాత్రమే.
నిమిషానికొక్కరు
రాష్ట్రంలో గత ఐదేండ్లలో సగటున నిమిషానికి ఒక కొత్త ఓటరు నమోదయ్యారు. ఎన్నికల సంఘం 2018 నవంబర్ 25న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,80,64,684 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3,17,17,389కు పెరిగింది. అయితే ఐదేండ్లలో ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం.
ఐదేండ్లలో పెరిగిన ఓటర్ల సంఖ్య 36,52,705
ఈ లెక్కన ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు 7,30,541
రోజుకు 2001 మంది, గంటకు 84 మంది ఓటర్లుగా మారారు.
నిమిషానికి సగటున 1.38 కొత్త ఓట్లు నమోదయ్యాయి.