హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఆశించిన లక్ష్యం దిశగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున చైతన్యవంతులై కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. వనపర్తి జిల్లాలో లక్ష్యానికి మించి 25.04 లక్షల మొక్కలు నాటడంతో 155.82 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లా 20.03 లక్షల మొక్కలు నాటి చివరిస్థానంలో నిలిచినట్టు అటవీశాఖ పేర్కొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8 విడతల హరితహారం ద్వారా 268.16 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ వెల్లడించింది.
ఆరు జిల్లాల్లో 100 శాతానికి మించి..
రాష్ట్రవ్యాప్తంగా 2022-23లో 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని అటవీశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. సోమవారంనాటికి 17.77 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ తెలిపింది. రాష్ట్రంలోని వనపరి ్త, మంచిర్యాల, జీహెచ్ఎంసీ, సంగారెడ్డి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కలు నాటినట్టు వెల్లడించింది. వనపర్తి జిల్లాల్లో 13.6 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, 25.044 లక్షలు, మంచిర్యాలలో 40.280 లక్షలకు 47.017 లక్షలు, జీహెచ్ఎంసీలో 50 లక్షలకు 55.114 లక్షలు, సంగారెడ్డిలో 55.4 లక్షలకు 58.983 లక్షలు, ములుగులో 14.970 లక్షలకు 15.598 లక్షలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 52.689 లక్షలకు 52.991 లక్షల మొక్కలు నాటి ముందు వరుసలో నిలిచాయి. మరో నాలుగు జిల్లాల్లో 90 శాతానికి పైగా, ఆరు జిల్లాల్లో 80 శాతానికి పైగా, నాలుగు జిల్లాల్లో 70 శాతానికిపైగా, ఆరు జిల్లాల్లో 60 శాతానికి పైగా, ఐదు జిల్లాల్లో 50 శాతానికి పైగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయింది. 8వ విడతలో ఇప్పటివరకు 17.774 కోట్లు మొక్కలు నాటగా, వీటిలో 13.981 కోట్ల మొక్కలు కాగా, 3.793 కోట్ల విత్తనబంతులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో అతితక్కువగా 28.32 శాతం, వరంగల్ అర్బన్ జిల్లాలో 36.28 శాతం మాత్రమే మొక్కలు నాటారు.