హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలతో ట్విట్టర్ హోరెత్తిపోయింది. ‘ట్రయంఫంట్ తెలంగాణ.. # థాంక్యూ కేసీఆర్’ (#TriumphantTelangana.. #ThankYouKCR) హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. 50 వేలకుపైగా ట్వీట్లతో ఇది దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడంపట్ల రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి గణాంకాలను కోట్ చేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ఆయన వివరించారు. దీన్ని మన రాష్ట్రం, దేశంలోని ప్రజలే కాకుండా పలువురు విదేశీయులు సైతం రీట్వీట్ చేస్తూ ప్రశంసించారు. కేటీఆర్ ట్వీట్ను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు.
ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పేందుకు తెలంగాణ రాష్ట్రమే పెద్ద ఉదాహరణ అని పలువురు కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేళ్లలో తానేమిటో దేశానికి చూపిందని, కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్థికాభివృద్ధి నిదర్శనమని వారు ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరిని నెటిజన్లు పెద్ద ఎత్తున ఎండగట్టారు. 2014లో ఐదు లక్షలుగా ఉన్న జీఎస్డీపీ 2022 నాటికి 130శాతం వృద్ధిని నమోదుచేస్తూ 11.54 కోట్లకు చేరడం కేసీఆర్ పరిపాలనా దక్షతకు ఓ మచ్చుతునక అని వారు పేర్కొన్నారు.
రాష్ట్రప్రగతికి సీఎం కేసీఆర్ నిచ్చెనలేస్తున్నారని, తలసరి వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవటం ఇం దుకు నిదర్శనమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామానాగేశ్వర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో అన్ని రంగాల్లో ప్రగతి పరుగులు తీస్తున్నదని తెలిపారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లో అగ్రగామిగా నిలవటం సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమని కొనియాడారు. తెలంగాణ దేశంలో భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్నా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 18.8 శాతం నమోదు కాగా జీఎస్డీపీలో 14.7 శాతం వృద్ధిరేటు నమోదు కావటం వెనుక సీఎం కేసీఆర్ అకుంఠిత పట్టుదల ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 2014-2015లో రూ. 1,24,104 ఉన్న తలసరిఆదాయం, 2021-22 నాటికి రూ. 2,78,833కు పెరగడం సీఎం పాలనా దక్షతకు సాక్ష్యమని పే ర్కొన్నారు. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అన్న సూత్రంతో రాష్ట్రం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భావం నుంచి అసాధారణ వృద్ధిని సాధిస్తున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలను అధిగమించిందని తెలిపారు. అనతి కాలంలోనే తలసరి ఆదాయం 125 శాతం పెరిగిందన్నారు. 2014లో రాష్ట్ర ప్రజల సగటు తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా, 2021 నాటికి రూ. 2,78,833కు పెరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ. 5 లక్షల కోట్లు ఉండగా అది 130 శాతం పెరిగి 2021లో రూ.11.54 లక్షల కోట్లకు చేరిందని అన్నారు.