హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ సమాన వేతనాలు ఉండేలా చూడాలని గ్రూప్-1 అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలున్నాయని, దీనిని సవరించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం ఆ సంఘం ప్రతినిధి బృందం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్, సభ్యుడు రామయ్యలతో బీఆర్కే భవన్లో సమావేశమైంది.
ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రతిపాదనలను కమిటీ ముందుంచారు. గ్రూప్-1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, గ్రూప్-1 పోస్టులను స్టేట్ సివిల్ సర్వీస్గా పరిగణించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. చాలా శాఖల్లో పదోన్నతులకు ఏండ్ల తరబడి సమయం పడుతున్నందున కాలానుగుణంగా పదోన్నతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.