పథకాల ద్వారా గ్రామాలకు నిధులు
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ
గ్రామీణుల్లో పెరిగిన కొనుగోలు శక్తి
పల్లె ప్రగతితో మారిన పంచాయతీల రూపు రేఖలు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదారులకు, గ్రామాలకు దాదాపుగా రూ.1.51 లక్షల కోట్లకు పైనే అందాయి. అదీ పారదర్శకంగా నేరుగా పంచాయతీలకు, లబ్ధిదారులకే అందటం గమనార్హం. ప్రస్తుతం మన పల్లెలు దేశానికే ఆదర్శంగా రూపుదిద్దుకొన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ వల్ల గ్రామాల స్వరూపమే మారిపోయింది. పల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. నిధులు వెల్లువెత్తడంతో ఆర్థిక, ఆరోగ్య, పరిపాలన, సంక్షేమ రంగాల్లో మెరుగయ్యాయి.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా చిన్న పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు, సమాచారం అందించడానికి వీలైంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు, నిధుల వివరాలు, ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేయటంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వచ్చాయి. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం పెరిగింది. రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్లు, తదితరాల కోసం గ్రామాలకు ప్రభుత్వం పల్లె ప్రగతి కింద రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. రైతుబంధు, ఆసరా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు వంటి పథకాల ఫలితంగా గ్రామీణ ప్రజలు ఎక్కువ లబ్ధి పొందారు. ఎంతలా అంటే.. ప్రభుత్వ సంక్షేమ చర్యల ఫలితంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రజల వద్ద డబ్బుకు కొదవ లేకుండా పోయింది. కారణం.. పల్లెల్లోని అత్యధిక కుటుంబాలు ఏదో ఒక పథకం కింద లబ్ధిదారులు కావటం వల్లే.