Prajapalana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కోటి ఆశలతో నిరుపేదలు ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ల కోసం చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరచనున్నారు. ఈ మేరకు పురపాలికలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక ట్రంకు పెట్టె చొప్పున కొనుగోలుచేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరచాలని సూచించారు. దీంతో ప్రస్తుతం అధికారులు ట్రంకు పెట్టెల కొనుగోళ్లపై దృష్టి సారించారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత కరువైం ది. కొన్ని చోట్ల కంప్యూటరీకరణకు కసరత్తు చేస్తుండ గా, చాలా చోట్ల ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్న ది. అందుకు పెద్దఎత్తున కంప్యూటర్ ఆపరేటర్లు కావా లి. అసలు కంప్యూటరీకరణకు ఒక నమూనానే లేదని ఓ అధికారి వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సైతం మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉన్నది.
ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ రెండో రోజు ముగిసింది. లక్షలాది దరఖాస్తులు కార్యాలయాలకు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ ట్రంకు పెట్టెల్లో భద్రపరచాలంటూ అధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఒక్కో ట్రంకు పెట్టెకు రూ.1,800 వరకు ధర ఉండటంతో కొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులు ఎవరు ఇవ్వాలి? అనే సందేహాలు తలెత్తాయి. మరోవైపు దరఖాస్తుదారుడికి ముద్ర వేసి రశీదు ఇవ్వాల్సి ఉన్నందున కౌంటర్లకు అనుగుణంగా ముద్రలు కూడా లేవని, శుక్రవారం కొత్తవాటికి ఆర్డర్ ఇచ్చామని హైదరాబాద్ శివారు మున్సిపాలిటీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని చోట్ల ట్రంకు పెట్టెలు కొనుగోలు చేయకుండా దరఖాస్తులను ఒక గదిలో భద్రపరుస్తున్నారు. కంప్యూటరీకరణ జరిగే వరకు ఎంత సమయం పడుతుందో తెలియనందున, ఆ ప్రక్రియ అంతా జరిగేలోపు కార్యాలయాల్లో దరఖాస్తులను కాపాడటం ఒక సవాల్ అని అధికారులు అంటున్నారు.
దరఖాస్తుల స్వీకరణ రెండోరోజూ ప్రజలకు తిప్పలు తప్పలేదు. ఓవైపు దరఖాస్తుల కొరత, మరోవైపు దొరికిన ఫారాలు నింపి, అధికారులకు ఇచ్చేందుకు ప్రజలు అవస్థలు పడ్డారు. మొదటి రోజు జరిగిన లోటుపాట్లను సరిచేసుకోవాలని సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఆదేశించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కొన్నిచోట్ల గ్రామసభకు ముందే కొంతమంది దళారుల చేతిలోకి దరఖాస్తు ఫారాలు వెళ్లాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసానిపల్లిలో కరెంట్ బిల్లులు ప్రజాపాలన కౌంటర్ వద్దే వసూలు చేశారు.
ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన ల భించిందని సీఎస్ శాంతికుమారి తెలిపారు. రెండో రోజు మొత్తం 8,12,862 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. పట్టణ ప్రాంతాలు, జీహెచ్ఎంసీతో కలిపి 4.89 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు అందినట్టు వివరించారు. శుక్రవారం ఆమె కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకొన్నందుకు అభినందించారు. దరఖాస్తు ఫారాలను విక్రయించకుండా చూడాలని మరోసారి స్పష్టంచేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, దరఖాస్తులు నింపడంలో సహకరించేలా వలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్లో గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మరణించారు. కుసంగి లక్ష్మయ్య(58) శుక్రవారం దరఖాస్తు ఇవ్వడానికి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ఫారాన్ని అధికారికి ఇస్తుండగానే గుండెపోటు రావటంతో కుప్పకూలాడు. గ్రామస్థులు హుటాహుటిన లక్ష్మయ్యను నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడు లక్ష్మయ్యకు భార్య స్వరూప, ఇద్దరు కుమారులు ఉన్నారు. జగిత్యాలలోని 30వ వార్డు గోరేమియా చౌరస్తాలో దరఖాస్తుల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. హైమదీబేగం అనే మహిళ చేతికి గాయమైంది. స్థానిక కాంగ్రెస్ నేత ఇంట్లో దరఖాస్తు ఫారాలను అందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.