హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కింద కొత్తగా ఆయకట్టును పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రెండు కాంపోనెంట్లుగా (1.14 & 1.15) గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
-గెజిట్ నోటిఫికేషన్లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండవ కాంపోనెంట్ను 25 టీఎంసీల నుండి 40 టీఎంసీల వరకు పెంచినట్లు చూపించారు. అది తప్పు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటి ఏపీ ప్రభుత్వం కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుండి 3.65 లక్షల ఎకరాలకు పెంచింది. కానీ నీటి కేటాయింపులు ఆ మేరకు సరిపోయినంతగా పెంచలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ పెంచిన ఆయకట్టుకు సరిపొయే నీటి కేటాయింపులు చేసింది తప్ప కొత్తగా ఆయకట్టును పెంచలేదు. కొత్త సోర్స్ నుండి నీటిని తీసుకొవడం లేదు అని తెలిపింది. ఆయకట్టు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను కూడా పేర్కొనడం జరిగింది.
-ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయిర్ నుండి +800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా 2006లోనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట నివేదించిన డీపీఆర్లోనే ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట నివేదిస్తూ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు FRL +885 అడుగుల వద్ద FRL కు సమీప మట్టం వద్ద నీటిని తీసుకునేవిధంగా డిజైన్ చేసినట్టు తెలిపారు.
-కల్వకుర్తి ఎత్తిపోతల కృష్ణా నది బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద, బేసిన్ ఆవలివి కాబట్టే ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారు అని తెలంగాణ స్పష్టం చేసింది. (నేడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా అదే కారణంగా +800 ఫీట్ల వద్ద డిజైన్ చేసింది).
-ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కొనసాగుతున్న KWDT-II వద్ద ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 75 శాతం నికర జలాలను (Dependable Water) కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర ప్రాజెక్టులకు మిగులు జలాల కేటాయింపు మాత్రమే కొరింది. 75 శాతం నికర జలాలు కేటాయించాలని కోరలేదు అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
-ఈ కారణాల రీత్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని, గెజిట్ నోటిఫికేషన్ నుండి కల్వకుర్తి రెండవ భాగాన్ని(1.15) తొలగించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.