హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుతులు, నీటి కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల సహా నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు గతంలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు కాల్వలకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని, వీటిపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వివరాలను తెలంగాణ ప్రభుత్వం తన లేఖకు జతపరిచింది.
బేసిన్ వెలుపలకు నీటి తరలింపుకే రాయలసీమ ఎత్తిపోతల చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా పనులు చేపట్టకూడదు. ఈ మేరకు గతంలో ఎన్జీటీ ఆదేశాలు ఉన్నాయి. అత్యున్నత మండలి భేటీలో ఎత్తిపోతల అంశం ప్రస్తావించాం. సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చే వరకు పనులు ఆపాలని కేంద్రం చెప్పిందని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది.