హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనుల్లో నాణ్యతా లోపం, నిర్మాణ లోపం లాంటి సమస్యలు లేవని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు. ఇంకా కొన్ని పెండింగ్ పనులు కొనసాగుతున్నందున పైప్లైన్లో మట్టి, ఇసుక కూరుకుపోయి ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిందని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం చిన్న సమస్యలను భూతద్దంలో చూపుతూ ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యాల కల్పన, కొనసాగుతున్న పనులపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శనివారం అరణ్యభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన ఆలయంతో పాటు మిగతా నిర్మాణాలు నూతనంగా చేపట్టినందున కొన్ని రోజులపాటు నిర్వహణ లోపాలను సరిదిద్దుకుంటూ ముం దుకు సాగాలని చెప్పారు. అడ్డంకులను అధిగమించి, భక్తులకు అద్భుతమైన వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 79 మిల్లీమీటర్ల అకాల భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని, అకాల వర్షాలతో ఉత్పన్నమైన సమస్యలను వానకాలం వచ్చేలోగా అధిగమించాలని ఆదేశించారు. మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలని సూచించారు.
భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చూడాలని, మంచినీరు అందించడంతో పాటు ఎండ వేడి నుంచి సేదదీరేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వసతి కల్పనలో జాప్యం ఉండొద్దని చెప్పారు. సమావేశంలో శాఖ కమిషనర్ అనిల్కుమార్, వైటీడీఏ చైర్మన్ కిషన్రావు, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.