హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ)/ నమస్తే తెలంగాణ నెట్వర్క్ : తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలూ లబ్ధిపొందుతున్నారు. బీజేపీలో గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్రకమిటీ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలను ఏదో ఒక రూపంలో అందుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నామని బాహాటంగానే చెప్తున్నవారెందరో. రైతుబంధు మొదలుకొని కల్యాణలక్ష్మి వరకు.. దళితబంధు నుంచి రైతుబీమా వరకు.. పథకం ఏదైనా అర్హులైన వారందరికీ ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినవే. వివక్షకు తావులేకుండా, ఏ పైరవీ అవసరం లేకుండా అర్హులందరికీ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారన్న వాస్తవాన్ని బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. తమకూ పథకాల ప్రయోజనాలను అందించడంపై వారు ఫిదా అవుతున్నారు. బీజేపీ విధ్వంసపు సిద్ధాంతాలను, టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలను వారు పోల్చి చూసుకుంటున్నారు. మంచి పథకాలను గుడ్డిగా వ్యతిరేకించడం మానేయాలని వారు సూచిస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా దళితబంధు
బీజేపీ నాయకుడినైన నేను దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మొదట్లో ఇష్టపడలేదు. చివరకు అప్లయ్ చేసి చూద్దామని అనుకున్న. నిజంగానే నన్ను ఎంపిక చేశారు. దళితబంధు కింద రూ.10 లక్షలు రావడం చాలా సంతోషంగా ఉన్నది. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేశారనడానికి నేనే ఓ ఉదాహరణ. సీఎం కేసీఆర్ సార్కు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నకు రుణపడి ఉంటాను.
– ఎస్ గణేశ్, మేడ్చల్ / బీజేపీ దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి
బీజేపీ లీడర్ కుటుంబాన్ని ఆదుకున్న రైతుబీమా
కీసర రమేశ్ ముదిరాజ్.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం జగన్గూడ వాసి. బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య లత, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. 18గంటల పొలం ఉండటంతో రమేశ్ రాష్ట్రప్రభుత్వ పథకం రైతుబీమా కింద పేరు నమోదు చేసుకున్నాడు. అనారోగ్యంతో గత ఏడాది జూన్ 2న రమేశ్ మృతిచెందాడు. దీంతో రైతుబీమా కింద ఆ కుటుంబానికి గత ఏడాది జూలై 7వ తేదీన రూ.5లక్షలు వచ్చాయి. ఆ కుటుంబం రోడ్డున పడకుండా నిలదొక్కుకుంది. కేసీఆర్ దేవుడిలాగా తమను ఆదుకున్నాడని రమేశ్ భార్య లత చెప్తున్నారు. ‘మా ఆయన బీజేపీ బీజేపీ అంటూ చాలా ఏండ్లు తిరిగిండు. ఆయన చనిపోయినప్పుడు ఆ పార్టీ నుంచి ఎవరూ మాకేమీ చెయ్యలేదు. కేసీఆర్ సారు దేవుడి లెక్క ఆదుకున్నడు. రైతుబీమా కింద ఐదులక్షలు వస్తే అప్పులు తీర్చుకున్నం. ప్రతిరోజూ సీఎం సారును గుర్తుచేసుకుంటున్నం..’ అని లత చెప్పారు.
ఏడాదికి రూ.44వేలు అందుతున్నయ్..
మాది మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని దాసరిపల్లి గ్రామం. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని అనడానికి నేనే ఓ ఉదాహరణ. నాకు రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ప్రతి పంటకూ రూ.22వేల చొప్పున సంవత్సరానికి రూ.44వేలు వస్తున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడిగా ఆ డబ్బును వాడుకుంటున్నాను.
– చంద్రశేఖర్రెడ్డి, దాసరిపల్లి, మహబూబ్నగర్ జిల్లా (బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)
రైతులకు వరం.. రైతుబంధు
తెలంగాణలోని రైతులందరికీ రైతుబంధు పథకం ఓ వరం లాంటిది. పార్టీలకు అతీతంగా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది. నాకు 12 ఎకరాల పొలం ఉంది. ప్రతి సంవత్సరం రైతుబంధు పథకం కింద రూ.లక్షా 20వేలు అందుతున్నాయి. కూలీల ఖర్చుకు, సాగు పనులకు ఈ పెట్టుబడి సాయం అక్కరకొస్తున్నది. విత్తనాలు, ఎరువులను కూడా ముందే కొనుగోలు చేస్తున్న. ఎలాంటి తేడా లేకుండా ప్రతి రైతుకూ సాయం అందిస్తున్న అద్భుతమైన పథకమిది.
–చల్లా రమేశ్ , అశ్వారావుపేట
(ఆర్ఎస్ఎస్ ధర్మజాగరణ అధ్యక్షుడు)
మా ఇంటికి కల్యాణలక్ష్మి వచ్చింది..
సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలతో లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. అం దులో నేనూ ఒకడిని. నా కూతురు ప్రత్యూష పెండ్లి సమయంలో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన వెంటనే అధికారులు చెక్కును అం దించారు. కల్యాణలక్ష్మి ఎంతో బాగుంది. ప్రతి పం టకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్నది.
– జంబుల దయాకర్, దాసర్లపల్లి, రంగారెడ్డి జిల్లా (కందుకూరు మండల బీజేపీ నాయకుడు)
పింఛన్ ఆదుకుంటున్నది..
ఇంట్లో మా నాన్నకు వికలాంగుల పింఛన్ కింద నెలకు రూ.3వేలు అందుతున్నాయి. ఎందరో అభాగ్యులకు, ఒం టరి మహిళలకు, వృద్ధులు, వి తంతువులకు ప్రభుత్వం పిం ఛన్లు అందిస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– సంతోష్, శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా (బీజేపీ కార్యకర్త)
పథకాలు చూసి కనువిప్పు..
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కోరె రమేశ్ ఐదు నెలల క్రితం వరకు బీజేపీ వీరాభిమాని. ఆ పార్టీలో చురుకైన కార్యకర్త. ఇటీవల ఆయన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి రైతు కావడంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా డబ్బులు అందాయి. ఆపత్కాలంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. సగటు బీజేపీ కార్యకర్తగా అప్పటివరకు ప్రభుత్వ పథకాలపై దురభిప్రాయంతో ఉన్న రమేశ్కు కనువిప్పు కలిగింది. తనలాంటి లక్షలమంది కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధిపొందుతున్నారన్న వాస్తవాన్ని గ్రహించిన ఆయన బీజేపీకి గుడ్బై చెప్పి.. టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే రైతుబీమా లాంటి పథకాలు తమలాంటి వారి దరికి చేరేవా అన్న ఆలోచననే తన కండ్లు తెరిపించిందని రమేశ్ చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల ఫలాలు చూసిన తర్వాతే టీఆర్ఎస్లో కార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నానని ఆయన అంటున్నారు.