హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.676 కోట్ల రుణాలను అందించింది. మూడో విడత రుణాల మంజూరు ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది. రెండో విడతలో తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించినవారికి మూడో విడతలో రుణాలను మంజూరు చేస్తున్నారు. వీధి వ్యాపారులకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి 7% వడ్డీకే రుణాలను ఇప్పిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,20,435 మంది వీధి వ్యాపారులు ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వీరిలో తొలి విడత రూ.10 వేల చొప్పున 3,60,246 మందికి రుణాలు ఇప్పించారు. ఈ రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించిన 1,58,352 మందికి రెండో విడతలో రూ.20 వేల చొప్పున రుణాలిచ్చారు.
సక్రమంగా తిరిగి చెల్లిస్తే వడ్డీలో రాయితీ
7 శాతం వడ్డీతో కూడిన ఈ రుణాలను ఏడాదిలోపే తిరిగి చెల్లించినవారికి 5% వడ్డీ వాపసు ఇస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ.58.84 కోట్ల వడ్డీ వాపసు ఇచ్చారు. ఇందులో తెలంగాణలోని వ్యాపారులకే దాదాపుగా 14 శాతం (రూ.8.24 కోట్లు) చెల్లించారు. వీధి వ్యాపారులకు రుణాలను ఇప్పించడంతోపాటు వారి వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెండింగ్ జోన్లను నిర్మిస్తున్నది. దుకాణాల ఏర్పాటు కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 షెడ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 1,294 పూర్తయ్యాయి. మిగిలిన 1,382 షెడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
డిజిటల్ లావాదేవీల్లోనూ అగ్రస్థానమే
డిజిటల్ లావాదేవీలను నిర్వహించేలా వీధి వ్యాపారులను ప్రోత్సహించడంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కనీసం రూ.25 విలువైన డిజిటల్ లావాదేవీలను నెలలో 200 కుపైగా నిర్వహించిన వ్యాపారులకు ప్రభుత్వం గరిష్ఠంగా రూ.100 చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నది. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.21.08 కోట్ల ప్రోత్సాహకాలను అం దజేయగా.. తెలంగాణలోని వీధి వ్యాపారులే రూ.4.13 కోట్లను అందుకున్నారు.
టాప్లో అన్నీ మన పట్టణాలే