హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ‘విదేశీ విద్యానిధి’ పథకాన్ని అమలు చేస్తున్న తరహాలోనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలువంటి దేశంలోని 200కుపైగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే మెరికల్లాంటి బీసీ విద్యార్థులకు సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ వివరాలను మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం వెల్లడించారు. ఈ పథకంపై సచివాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. విధివిధానాలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ అవకాశం ఉండేదని, ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు కూడా అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లకుపైగా వెచ్చిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి విదేశాల్లోని అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే పథకాల్లో మెజార్టీ వాటా బీసీలకే దక్కుతున్నదని తెలిపారు. ప్రత్యేకంగా రూ.వేలకోట్లతో ఆత్మగౌరవ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష సహాయం, లక్షలాది బీసీ బిడ్డలకు నాణ్యమైన ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకులాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే బీసీ బిడ్డలకు ఫీజు చెల్లించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ బిడ్డలు ఎకడ చదివినా కేసీఆర్ సాయం: జూలూరు
దేశంలో ఎకడాలేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకొనేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం విప్లవాత్మకమైనదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ కొనియాడారు. 10 వేల మంది బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం అంటే… 10 వేల బీసీ కుటుంబాలకు ప్రభు త్వం భరోసాగా నిలిచినట్టేనని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో తమ బిడ్డలను చదివించుకోవడం బీసీలకు ఎంతో భారంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంతో ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గినట్టేనని తెలిపారు. అదనంగా కేటాయించే రూ.150 కోట్లు వేలా ది మంది బీసీ బిడ్డల భవిష్యత్తు వెలుగులకు పునాదులు అవుతాయని చెప్పారు. పేద బీసీ బిడ్డలు దేశ విదేశాల్లో ఎకడైనా చదువుకొనేందుకు వెనుకాడాల్సిన పనిలేదని, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.