CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 1.50 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాడల్ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అవకాశమున్న చోట ఆ నమూనా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. లక్షలాదిమంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపి, వారిలో స్ఫూర్తి నింపేందుకే ఉద్యోగ నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపడుతున్నామని, అంతేతప్ప ఇందులో ప్రచార యావ లేదని పేర్కొన్నారు.
ఎల్బీస్టేడియం వేదికగా జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన 543 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 1,463 జూనియర్ కళాశాలల లెక్చరర్లు, 2,632 టీజీటీ, 479 మంది కానిస్టేబుళ్లు, 75 మంది వైద్య సిబ్బందికి సీఎం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల కాలంలోనే 30 వేలమందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేది చదువు ఒక్కటేనని, అదొక్కటి ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని సీఎం పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడమంటే సామాజిక బాధ్యతను తీసుకోవడమేనని తెలిపారు. ఉద్యోగ నియామకపత్రాల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా అందేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేశారని అభినందించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దుద్దిళ్ల, పొన్నం, కొండా, తుమ్మలతోకలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఇంగ్లిష్ రాదని వెక్కిరిస్తున్నారు
తనకు ఇంగ్లిష్ రాదని వెక్కిరిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని గుర్తు చేశారు. తాను ఈ రోజు రాష్ర్టానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానంటే నాడు ఆ పాఠశాలలో అందించిన విద్యే కారణమని పేర్కొన్నారు. ఎక్కడో చదువుకున్న వారు తనకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేస్తున్నారని, ఇంగ్లిష్ అనేది ఓ భాష మాత్రమేనని, అది అభివృద్ధికి ఆటంకం కాదని వివరించారు. ఇకపై, ఇంగ్లిష్ రాదని అవహేళన చేసే పరిస్థితి రావొద్దని, ఉపాధ్యాయులు పిల్లలకు ఇంగ్లిష్ నేర్పాలని సూచించారు.