ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పంపిణీ
రూపకల్పన పూర్తిచేసిన ఎస్సీఈఆర్టీ
టర్మ్-1, టర్మ్-2కు విడివిడిగా ముద్రణ
మన ఊరు-మన బడి, ఇంగ్లిష్ మీడియం బోధనను విజయవంతం చేసేందుకు విద్యాశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది. వినూత్న ఆలోచనలతో ప్రణాళికలు రూపొందిస్తున్నది. పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించడం, తరగతి గదుల్లో గ్రీన్ చాక్పీస్ బోర్డుల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. మరోవైపు మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా ఎన్నారైలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నెల 12న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలను ఇక రెండు భాషల్లో ముద్రించనున్నారు. ఎడమ వైపు పేజీలో ఇంగ్లిష్, కుడి వైపు పేజీలో తెలుగు లేదా ఆయా విద్యార్థులకు సంబంధించిన మాతృభాషలో ముద్రిస్తారు. సర్కార్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. దీనివల్ల ఇంగ్లిష్ సరిగా అర్థంకాని విద్యార్థులు తమ మాతృభాషలో ఉన్న పాఠాన్ని చదువుకోవడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇంగ్లిష్లో పదాలు, వాక్యాలను రాసే విధానాన్ని విద్యార్థులు తేలికగా నేర్చుకోవచ్చునని చెప్తున్నారు. మాతృభాషను కాపాడుకోవడానికీ ఇది ఉపకరిస్తుందని అంటున్నారు. ద్విభాషా పుస్తకాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ పుస్తకాలకు ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు తుది రూపునిచ్చారు. త్వరలోనే ముద్రణ ప్రారంభించనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతానికి 1 నుంచి 7 తరగతి వరకు అన్ని సబ్జెక్టు పుస్తకాలను రెండు భాషల్లో ముద్రించనున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ వంటి భాషా పుస్తకాలు మాత్రం ఎప్పటిమాదిరిగానే ఒకే భాషలో ఉంటాయి. వీటిని మినహాయించి సైన్స్, గణితం, సాంఘికశాస్త్రం పుస్తకాలను ద్విభాషల్లో ముద్రిస్తారు. 3,4,5 తరగతుల్లో పరిసరాల విజ్ఞానం, 6,7 తరగతుల్లో గణితం, సైన్స్, సోషల్స్టడీస్ పుస్తకాలను ద్విభాషా పుస్తకాలుగా అందుబాటులోకి తెస్తారు.
టర్మ్-1, టర్మ్-2 విడివిడిగా..
పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం రెండు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొదటి సగం సిలబస్కు ఒక ఎస్ఏ, మిగతా సగం సిలబస్కు రెండో ఎస్ఏ చొప్పున నిర్వహిస్తున్నారు. ఎస్ఏ-1, ఎస్ఏ-2 పుస్తకాలను టర్మ్-1, టర్మ్-2 పేరుతో విడివిడిగా ముద్రించనున్నారు. దీనితో పుస్తకాల సంఖ్య పెరిగినప్పటికీ, విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. .
పాఠశాలల్లో లక్షన్నర గ్రీన్చాక్పీస్ బోర్డుల ఏర్పాటు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డుల స్థానంలో గ్రీన్ చాక్పీస్ బోర్డులు వినియోగించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నది. అన్ని తరగతి గదులకు కలిపి 1.5 లక్షల గ్రీన్ చాక్పీస్ బోర్డులు అవసరమని అంచనా వేసింది. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 77వేల బోర్డులను బిగించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం 1.02 లక్షల తరగతి గదులున్నాయి. మరో 8 వేల అదనపు తరగతి గదులను నిర్మించనున్నారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాల్లోనూ ఈ బోర్డులు అవసరమవుతాయి. మొత్తంగా 1.5 లక్షల గ్రీన్ చాక్పీస్ బోర్డులను బిగించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కొక్క బోర్డుకు రూ.10 వేలకు పైగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. రాష్ట్రస్థాయిలోనే టెండర్లు ఆహ్వానించి తయారీదారుల నుంచి తెప్పించి, స్కూళ్లకు సరఫరాచేస్తారు. 8X12 అడుగుల సైజు బోర్డులను అమర్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సిరామిక్ స్టీల్ గ్రీన్ చాక్పీస్ బోర్డులను తెప్పించనున్నారు. బోర్డులకు వారంటీ ఉండేలా, గడువు మధ్యకాలంలో చెడిపోతే, సరఫరాదారుడే మరో బోర్డును బిగించేలా చర్యలు తీసుకోనున్నారు.
12న ఎన్నారైలతో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి భేటీ: మహేశ్ బిగాల
మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేసేందుకు కృషిచేస్తున్నట్టు గ్లోబల్ టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై సంఘాలతో ఈ నెల 12న సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా ఎన్నారైలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువగా విరాళాలు ఇచ్చేవారి పేర్లు లేదా, వారు సూచించిన పేర్లను తరగతి గదులకు పెట్టనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు చొరవ తీసుకొంటున్నట్టు మహేశ్ బిగాల తెలిపారు. పాఠశాలల్లో వందశాతం విద్యుద్దీకరణ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఫర్నీచర్, కొత్త తరగతి గదులు, సురక్షిత తాగునీరు, డిజిటల్ విద్య, ప్రహరీగోడలు, కిచెన్షెడ్లు, డైనింగ్హాల్స్ నిర్మాణం వంటి 12 అంశాలపై దృష్టి సారించే ఈ పథకం గొప్పదని పేర్కొన్నారు