ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికీ మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అక్కడ కొన్ని తరగతుల విద్యార్థులకు పెట్టి మరికొందరికి పెట్టకుండా ఉంటే ఇంట్లో పదిమంది ఉంటే నలుగురికే అన్నం పెట్టినట్టు ఉంటది’
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ సరారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించనున్నారు. విద్యార్థులకు చకని బోధనతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇకపై వారి ఇంట్లో ఒంటిపూటే తింటారు. సీఎం అల్పాహార పథకం ప్రారంభమయ్యాక విద్యార్థులు నేరుగా బడికి వచ్చి అల్పహారం, మధ్యాహ్న భోజనం ఇలా రెండు పూటలా బడిలోనే కడుపు నింపుకొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 28,807 స్కూళ్లలో 23,05,801 మంది చిన్నారులు బ్రేక్ఫాస్ట్ ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలతోపాటు, ఎయిడెడ్, మాడల్ స్కూళ్లు, మదర్సాల్లోని విద్యార్థులకు సైతం బ్రేక్ఫాస్ట్ను సమకూర్చనున్నారు.
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న విద్యార్థుల అల్పాహార పథకాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల బృందాన్ని ఇటీవల అక్కడికి పంపారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హొలికేరి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో కూడిన ఉన్నతాధికారుల బృందం తమిళనాడులో పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార విధానాన్ని అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఆ నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్ సర్కార్ ‘పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో విద్యార్థులకు అల్పాహారం పెడదాం. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికి మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అక్కడ కొన్ని తరగతుల విద్యార్థులకు పెట్టి మరికొందరికి పెట్టకుండా ఉంటే ఇంట్లో పదిమంది ఉంటే నలుగురికే అన్నం పెట్టినట్టు ఉంటది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ఫాస్ట్ను అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతియేటా దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
సీఎం బ్రేక్ఫాస్ట్ మెనూను ఖరారు చేయడంపై విద్యాశాఖ దృష్టిసారించింది. రవ్వ ఉప్మా, పొంగల్, కేసరి, కిచిడీ వంటి పదార్థాలతో కూడిన మెనూను అధికారులు పరిశీలిస్తున్నారు. పల్లి చట్నీ, సాంబార్ సైతం వడ్డించనున్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పోషకాహారంగా అందిస్తున్న రాగిజావ, ఉడికించిన కోడిగుడ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల ప్రారంభానికి ముందే రాగిజావను అందించనుండగా, మధ్యాహ్న భోజనానికి, రాగిజావకు మధ్యలో బ్రేక్ఫాస్ట్ను అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనం రెండు గంటల తరువాత అందించాలని యోచిస్తున్నారు.
దసరా కానుకగా రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని అందించాలని నిర్ణయించడం పట్ల సీఎం కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీంతో రాష్టంలోని 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇప్పటికే విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుండగా, బ్రేక్ఫాస్ట్తో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగే అవకాశముంటుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం స్వాగతించాయి. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావ రవి, టీఆర్టీఎఫ్ నేతలు అశోక్కుమార్, కటకం రమేశ్, దాముక కమలాకర్లు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
‘తరగతి గదిలోనే భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’ అని బలంగా విశ్వసించిన సీఎం కేసీఆర్ విద్యార్థులకు బలమైన భవిష్యత్తును అందించాలనే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దొడ్డుబియ్యంతో పురుగుల అన్నం నీళ్ల చారుతో మధ్యాహ్న భోజనాన్ని అధ్వాన్న భోజనంగా మార్చిన దురవస్థకు తెలంగాణ సర్కారు చరమగీతం పాడింది. సంపన్న బిడ్డలు తినే ఆహారాన్ని పేదింటి బిడ్డలూ తినాలని సంకల్పించి విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వారంలో మూడు రోజులు కోడిగుడ్డును అందిస్తున్నారు. గురుకులాల్లో అయితే ఒక్కో విద్యార్థి మీద రూ. 1లక్షా 25వేలను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నది. మధ్యాహ్న భోజనం పథకం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలు తమ పిల్లలను చదివించగలుగుతున్నాయని ఉపాధ్యాయులు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
పేదవర్గాల పిల్లలు బడికి రాగానే అల్పాహారం అందించే పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడంపై తెలంగాణ సమాజం హర్షిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తన మానవీయతను మరోసారి చాటి చెప్పింది.
– జూలూరు గౌరీశంకర్, సాహిత్య అకాడమీ చైర్మన్
చట్టసభలలో బీసీలకు, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.. కేంద్రప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– మెట్టు శ్రీనివాస్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
చట్టసభలలో మహిళలకు, బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు పెట్టాలనే డిమాండ్ను సీఎం కేసీఆర్ దేశ పాలకుల ముందు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయం. మోదీ ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు న్యాయం చేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలివ్వడం ద్వారా సీఎం కేసీఆర్ బీసీ కులాల భవిష్యత్తుకు భరోసాగా నిలిచారు.
– డాక్టర్ ఆంజనేయగౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్