ముడి బియ్యం సేకరణకు కేంద్రం లేఖ
రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సమాచారం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఈ యాసంగి సీజన్కు సంబంధించి ముడి బియ్యం (రా రైస్) తీసుకొనేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ యాసంగిలో 40.20 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది.
యాసంగిలో రాష్ట్రంలో రా రైస్ రాకపోయినప్పటికీ రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం నష్టాన్ని భరిస్తూ రా రైస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో యాసంగిలో సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వీటికి సంబంధించి సుమారుగా 40.20 లక్షల టన్నుల బియ్యం (సీఎమ్మార్) వచ్చే అవకాశం ఉన్నది. ఈ మొత్తాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం అంగీకరించి బియ్యం కొనుగోలు చేస్తామని వెల్లడించింది.