రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్, మార్చి 15 : ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తున్నామన్నారు. మంగళవారం శాసనమండలిలో ప్రత్యేక చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడారు. ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించిందని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా 2.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 50 నుంచి 70 వేల ఎకరాలకు ఆయిల్పామ్ విస్తీర్ణం పెరిగిందన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 10 నుంచి 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర రైతులు ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు కావడం వల్ల, ఎంత విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు చేపడితే రైతులకు లాభసాటిగా ఉంటుందో అధికారులు చెప్పాలన్నారు. అదేవిధంగా ఆయిల్పామ్ విత్తన మొక్కలు అందించే నర్సరీలు డిమాండ్కి అనుగుణంగా పెంచాలని, ఆయిల్ఫెడ్ లేదా ఉద్యానశాఖలో ఈ విషయంపై ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేసి ఆయిల్పామ్ తోటలు పెట్టిన రైతుల పొలాలకు వెళ్లి తగు సలహాలు, సూచనలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
నెల్లికల్లు ఎత్తిపోతల పనులు ప్రారంభించండి: ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో నెల్లికల్లు లిఫ్ట్ పనులను ప్రారంభించాలని నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కోరారు. మంగళవారం మండలిలో ప్రత్యేకచర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.