హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పి విద్యాభివృద్ధికి బాటలు వేసింది. షాదీముబారక్ తదితర కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ ఆర్థిక చేయూత అందిస్తున్నది. ఇదే సమయంలోనే ఉర్దూ భాష పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందుకు ఎనిమిదేండ్లలో రూ.76.34కోట్ల బడ్జెట్ను కేటాయించింది. పోటీ పరీక్షల కోసం ఉర్దూ భాషలో పుస్తకాల ముద్రణ చేపట్టగా, దాదాపు 30,812 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరింది.
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వెయ్యి మంది అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ను పంపిణీ చేసింది. యూజీసీ ఆమోదించిన సిలబస్ మేరకు మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు సంబంధించిన రాజనీతిశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, హిస్టరీ సబ్జెక్టులలో 9 వేల ఉర్దూ మీడియం పుస్తకాలను ముద్రించింది. ఉర్దూ డైరెక్టరీ , దురూస్ ఇ ఉర్దూ, షాకత్ ఇ ఉస్మానియా, సా హిత్య పుస్తకాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.52.65 కోట్లతో సెమినార్ల నిర్వహణకు 152 ఉర్దూఘర్, షాదీఖానాలను నిర్మిస్తున్నది. ఆన్లైన్లో ఉర్దూ భాషను నేర్చుకోవడం కోసం క్రాష్ కోర్సును కూడా ప్రారంభించింది. మొత్తం మీద ఉర్దూభాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది.