హైదరాబాద్ : హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శాసనమండలిలో సోమవారం హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన హరితహారాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు తెలంగాణ హరిత నిధి (Telangana Green Fund) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు.
మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా, ప్రజలకు పచ్చదనంపై అవగాహన పెరిగేలా సీఎం హరిత నిధిని ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటి వరకు ఏడు విడుతల్లో హరితహారం 239.87 కోట్ల మొక్కలు నాటి, లక్ష్యాన్ని దాటినట్లు చెప్పారు. ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండడంతో రాష్ట్రంలో పచ్చదనం క్రమంగా పెరుగుతున్నదన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 2014-15 నుంచి 2021 వరకు రూ.6,555.97కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.