వాహనదారుల భద్రతకు అడుగడుగునా నిఘా
రోడ్లపై సైన్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుతో అప్రమత్తం
గతంలోనే సర్కార్కు సుప్రీంకోర్టు కమిటీ ప్రశంస
రాష్ట్ర ప్రతిపాదనలను పట్టించుకోని కేంద్రం
అటకెక్కిన రోడ్డు సేఫ్టీ పోలీసుస్టేషన్ల ప్రతిపాదన
ఈసారైనా నిధులు వచ్చేనా?
కేంద్రం తీరుపై వ్యక్తమవుతున్న సందేహాలు
హైదరాబాద్, మే23(నమస్తే తెలంగాణ): రోడ్ల ప్రమాదాల నివారణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. వాహనదారుల భద్రతే ధ్యేయంగా అడుగడుగునా నిఘా పెట్టింది. రోడ్లపై ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నది. రోడ్లు భవనాలు, పోలీసులు, ట్రాన్స్పోర్టు, వైద్య, విద్యశాఖల సమన్వయంతో ట్రాఫిక్పై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర ప్రతిపాదనలను అటకెక్కించిన కేంద్రం.. ప్రమాదాల నివారణ చర్యలపై కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. రోడ్ల భద్రతపై మార్గదర్శకాలను మార్చి వరకే రూపొందించి రాష్ర్టాలకు అందించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణకు తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని 2020లో సుప్రీంకోర్టు కమిటీ తెలిపింది. 2020 డిసెంబర్ 3న వర్చువల్ సమావేశంలో కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ కితాబిచ్చారు.
నిత్యం నిఘా
వాహనాల అతి వేగానికి సర్కారు కళ్లెం వేసింది. జాతీయ రహదారులపై కూడా గంటకు 80 కిలో మీటర్లు దాటి వెళ్లకుండా కట్టడి చేసింది. అడుగడుగునా పోలీసింగ్ పెంచింది. జాతీయ, రాష్ట్రీయ రహదారులపై నిత్యం పెట్రోలింగ్ పెంచింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసింది. దాంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
అటకెక్కిన రోడ్డు సేఫ్టీ పోలీసు స్టేషన్ల ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పోలీసింగ్ ఎక్కువగా పెంచాలని భావించింది. ఈ మేరకు రాష్ట్రంలోని హైవేలపై 150 రోడ్ సేఫ్టీ పోలీస్టేషన్లు ఏర్పాటు చేయాలని 2017లో కేంద్రాన్ని కోరుతూ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. ఒక్కో పోలీస్టేషన్కు 3 వాహనాలు, క్షతగాత్రులను కాపాడటానికి హైడ్రాలిక్ కాంబీ టూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కానీ ఐదేండ్లలో ఈ ప్రతిపాదనను కేంద్రం అటకెక్కించింది. తెలంగాణ ప్రజల ప్రాణాలను కేంద్రం గాలికొదిలేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
ఈ సారైనా…
రోడ్డు ప్రమాదాల నివారణకు దేశవ్యాప్తంగా ఐదేండ్లలో రూ. 7,700 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ సారైనా రాష్ర్టానికి నిధులు ఇస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిధులలో 50 శాతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ, 25 శాతం ప్రపంచ బ్యాంక్, మరో 25 శాతం ఏషియన్ డెవలప్మెంట్ బా్ంయకుల నుంచి రుణంగా ఇస్తారు. అయితే ఈ నిధులు ఎంత మేరకు వస్తాయన్నది వేచి చూడాల్సి ఉన్నది. కేంద్రం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరితేనే నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత వరకు ముందుకు వెళుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2017లో రాష్ట్ర స్థాయిలో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఏర్పాటుచేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీని నియమించారు. రోడ్ల ప్రమాదాలు సంభవిస్తే ఘటన స్థలానికి 5 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకునేలా వీలు కల్పించారు. అన్ని జిల్లా, ప్రధాన దవాఖానల్లో ట్రామాకేర్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. పోలీస్, రవాణా, విద్య, వైద్య, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు జరిగే ఏరియాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.