Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా(Accident Insurance)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భట్టి వెల్లడించారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయని డిప్యూటీ సీఎం వివరించారు.
ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. తద్వారా ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు సైతం రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకు వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో.. 5.14 లక్షల మందికి లబ్ది పొందుతారని భట్టి తెలిపారు.