సోదరుడికి ఉద్యోగ నియామక పత్రం
అందజేసిన ఎర్రబెల్లి దయాకర్రావు
అగ్నిపథ్తో కేంద్రం కూలడం ఖాయం
సంస్మరణ సభలో మంత్రి ఆగ్రహం
ఖానాపురం, జూన్ 27: అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రూ.25 లక్షల చెక్కుతో పాటు రాకేశ్ సోదరుడు రామరాజ్కు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేశారు. రాకేశ్ స్వగ్రామం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్పేటలో సోమవారం సంస్మరణ సభ నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, కలెక్టర్ బీ గోపి తదితరులు రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆగ్నిపథ్ను వెంటనే రద్దుచేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా పోరాడినందుకే రాకేశ్ను కేంద్రం హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకేశ్ మృతిని కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని, ఇంత కన్నా దుర్మార్గం మరొకటి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాకేశ్ హత్యపై స్పందించలేదని అన్నారు.
రాకేశ్ మృతిపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదని దుయ్యబట్టారు. రాకేశ్ కుటుంబంపై నిజమైన ప్రేమ ఉంటే.. సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు సాయం చేసినవిధంగానే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల నుంచి ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే రాకేశ్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి, మరింత ఆదుకొనేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాకేశ్ పేరు మీద దబీర్పేట గ్రామాన్ని దత్తత తీసుకొంటానని ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో, దళితబంధు పథకంలో దబీర్పేటకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.