హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం 36,044 మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తున్నదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. గురువారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం అధికారులు 2021-22 వార్షిక నివేదికను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.55 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు, బాధితులకు సహాయం కోసం 164 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లు (ఐసీటీసీ) పనిచేస్తున్నట్టు వివరించింది.
తల్లుల నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు చెప్పారు. నిరుడు 6.84 లక్షల మంది గర్భిణులకు పరీక్షలు చేశామన్నారు. హెచ్ఐవీ బాధిత గర్భిణుల్లో 558 మంది ప్రసవించారని, ఇందులో ఏడుగురు పిల్లలకు తల్లి ద్వారా వైరస్ సోకిందని పేర్కొన్నారు. మిగతా పిల్లలు సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు. హెచ్ఐవీ నియంత్రణ కోసం కేంద్రం 2024 నాటికి నిర్దేశించిన లక్ష్యాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచినట్టు చెప్పారు. కొత్త కేసులను 80 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం కాగా తెలంగాణలో ఇప్పటికే 81% తగ్గాయని వివరించారు. ఇదే సమయంలో జాతీయ సగటు 46% వద్దనే ఉన్నదని పేర్కొన్నారు. బాధితుల్లో 95% మందికి చికిత్స అందించాలన్న లక్ష్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని, జాతీయ సగటు 84 శాతంగా నమోదైందని చెప్పారు.