హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో జరిపిన సమీక్షలో తీసుకొన్న నిర్ణయం మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఏటా గణేశ్ ఉత్సవాలు, శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోనే హైదరాబాద్ గణేశ్ శోభాయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని అన్నారు. మంత్రిని కలిసినవారిలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, జనరల్ సెక్రటరీ భగవంతరావు, వైస్ ప్రెసిడెంట్ కరోడిమాల్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్సవ సమితి కమిటీ సభ్యుడు రామరాజు ఉన్నారు.