Reservation | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు క్యాటగిరీల్లో 100లో 33 శాతం (1/3) రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేశ్కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ విధానం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు -1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వుడ్ క్యాటగిరీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన ఉన్నది. గ్రూప్ – 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేశ్కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఎస్పీఎస్సీ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. ప్రస్తుతం.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి టీఎస్పీఎస్సీతోపాటు ఇతర విభాగాధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
రోస్టర్ పాయింట్ల పట్టిక 1-100 పాయింట్లను పరిగణనలోకి తీసుకొంటే ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల్లో మహిళలకు 33 (1/3) శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. 2018లో జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత మళ్లీ 1 నుంచి రిజర్వ్ చేయడం ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీల్లో రిజర్వ్ చేసిన పాయింట్లలో మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, ఎక్స్ సర్వీస్మెన్ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. సమాంతర రిజర్వేషన్లన్లను అనుసరించి.. రోస్టర్ పాయింట్ల ప్రకారం మహిళలకు ఎక్కువ పోస్టులు వస్తే అవి వారికే ఉంటాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ , దివ్యాంగుల క్యాటగిరీల్లోని మహిళలు జనరల్ కోటాలో మెరిట్లో ఉద్యోగం సాధించారనుకొంటే.. ఆ రిజర్వ్డ్ క్యాటగిరీలో మహిళల కోసం ప్రత్యేకంగా పేరొన్న పోస్టులను డీ రిజర్వ్ చేస్తారు.
ఉదాహరణకు.. ఒక సామాజికవర్గంలో 1 నుంచి 10 వరకు పది పోస్టులు ఉన్నాయి. అందులో 8, 9, 10 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అందులో మొదటి 3 ఉద్యోగాలను మెరిట్ ప్రకారం మహిళలే సాధించారు. అలాంటప్పుడు.. మొదటి 3 పోస్టులను మహిళలకు కేటాయించి.. 8,9,10 స్థానాల్లో మహిళా రిజర్వేషన్లను డీ రిజర్వ్ చేస్తారు. ఆ 3 పోస్టులను అదే సామాజికవర్గంలో జనరల్ పోస్టులుగా మారుతాయి. వాటికి మహిళలు, పురుషులు సమానంగా పోటీ పడవచ్చు. పది ఉద్యోగాల్లో ఒకవేళ తొలి ఏడింటిలో 2 పోస్టుల్లో మహిళలు మెరిట్ సాధిస్తే.. మహిళలకు కేటాయించిన మిగిలిన 3 పోస్టుల్లో రెండు డీ రిజర్వ్ చేస్తారు.