కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే జీవోలు జారీచేసింది. మూలవేతనంపై 17.29 శాతం ఉన్న డీఏను 20.02 శాతానికి పెంచింది.మొత్తం 18 నెలల బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేయనున్నది. ఈ నెల నుంచి నేరుగా వారి వేతనాలతో కలిపి పెంచిన డీఏను అందించనున్నది. సీపీఎస్ ఉద్యోగులకు 10% ప్రాన్ అకౌంట్లో, మిగిలిన మొత్తం 8 విడతలలో నగదుగా అందించనున్నది.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను (2.73%) మంజూరు చేసింది. మూలవేతనంపై ప్రస్తుతం ఉన్న డీఏను 17.29% నుంచి 20.02 శాతానికి పెంచుతూ ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు సోమవారం జీవోలు-9,10 జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీవో-9, పెన్షనర్లకు జీవో-10 పేరిట ఉత్తర్వులు విడుదల చేశారు. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు సంబంధించిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్లో జమచేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. జీపీఎఫ్ ఉన్న వారికి జీపీఎఫ్లో జమచేయనుండగా, జీపీఎఫ్ లేని సీపీఎస్ ఉద్యోగులకు 10 శాతాన్ని ప్రాన్ అకౌంట్లో, మిగిలిన 90% ఎరియర్స్ను ఎనిమిది సమాన వాటాల్లో నగదు రూపంలో అందజేస్తారు.
జీపీఎఫ్ అర్హత లేని ఫుల్టైం కాంటింజెంట్ ఉద్యోగుల ఎరియర్స్ను మే 1న అందుకునే వేతనంతో కలిపి ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగి చనిపోతే నగదు మొత్తాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తారు. పెన్షనర్లకు కూడా 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు గల ఎరియర్స్ను ఎనిమిది సమాన వాటాల్లో అందజేయనున్నారు. పార్ట్టైం అసిస్టెంట్స్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్కు 2021 జూలై 1 నుంచి నెలకు రూ. 100 చొప్పున ఎరియర్స్ను ప్రభుత్వం మంజూరుచేసింది.
7 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు డీఏను 2.73% పెంచినట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ పెంపు 2021 జూలై 1 నుంచి వర్తిస్తుందని తెలిపారు. డీఏ పెంపు పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవో నేతలు వీ మమత, సత్యనారాయణ, పీఆర్టీయూటీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలు దాముక కమలాకర్, చీటి భూపతిరావు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వీ శ్రీనివాస్గౌడ్కు ధన్యవాదాలు తెలియజేశారు.
సబ్జెక్టు టీచర్ల సమస్యకు పరిష్కారం
ఏడున్నర ఏండ్ల తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం వల్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరుతుంది. ప్రధానోపాధ్యాయుల సమస్య పరిష్కారం అవుతుంది. మంచి పర్యవేక్షణ లభిస్తుంది. పాఠశాలల్లో గుణాత్మక మార్పు వస్తుంది. 2009 తర్వాత ఇంత పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించినందుకు సంతోషం. ఈ నిర్ణయం ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఎస్టీఎఫ్ తరపున కృతజ్ఞతలు.
– సదానందగౌడ్, ఎస్టీఎఫ్ ప్రధానకార్యదర్శి
విద్యా వ్యవస్థ బాగుపడుతుంది
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి. హెచ్ఎంల ఖాళీలు భర్తీ అవుతాయి. పాఠశాల పర్యవేక్షణ మెరుగవుతుంది. అకడమిక్ సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏప్రిల్ 23న బదిలీలు జరపడం శుభపరిణామం. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు.
– చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ ఎంఎల్సీ అభ్యర్థి
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది ఉపాధ్యాయులకు శుభపరిణామం. సీఎం కేసీఆర్కు, మంత్రులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఉద్యోగులకు డీఏ ప్రకటించినందుకు ధన్యవాదాలు.
– మారెడ్డి అంజిరెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పారదర్శకంగా ప్రక్రియ
డైరెక్టు రిక్రూట్మెంట్ వారికి ఇబ్బంది కలుగకుండా బదిలీలు జరగాలి. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పదోన్నతులు, బదిలీలు చేయ డం వల్ల అవకతవకలకు అవకాశం లేకుం డా పారదర్శకంగా ప్రక్రియ ముగుస్తుంది.
– పింగలి శ్రీపాల్రెడ్డి, తెలంగాణ టీచర్ జేఏసీ చైర్మన్
ఇది మంచి నిర్ణయం
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ టీచర్స్ యూనియన్ తరపున స్వాగతిస్తున్నాం. స్పౌజ్ బదిలీలు అమలు చేయాలి. పండితులకు పదోన్నతులు కల్పించాలి .ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు కల్పించినందుకు సీఎం కేసీఆర్కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు.
– ఎం.మణిపాల్రెడ్డి, టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు .
డీఏ ప్రకటించడంపై టీజీవోల హర్షం
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు డీఏ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కి, ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్రావుకి టీజీవో సెంటర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు వీ.మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీ రవీందర్రావు, ఎంబీ కృష్ణయాదవ్, జీ వెంకటేశ్వర్లు, బీ వెంకటయ్య, అరుణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.