హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చిన ఆర్థికశాఖ తాజాగా మరో 3,334 పోస్టుల్లో నియామకాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖల వారీగా వేర్వేరు జీవోలు విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని దాదాపు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ గత శాసనసభ సమావేశాల్లో ప్రకటించారు. ఆ దిశగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది.
ఒక్కో శాఖ వారీగా ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులను మంజూరు చేస్తున్నది. తొలివిడతగా వైద్యారోగ్యం, పోలీస్, గ్రూప్-1, 2 తదితర శాఖలకు సంబంధించి 30,453 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో విడతగా ఫైర్ సర్వీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి అనుమతిచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి పలు సడలింపులను కూడా ప్రకటించింది. గ్రూప్-1, 2 పరీక్షలకు ఇంటర్వ్యూల ప్రక్రియను ఈసారి ఎత్తివేసింది. యూని ఫామ్ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు రాష్ట్ర ప్రభు త్వం మూడేండ్ల వయోపరి మితిని పెంచింది. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు బుధవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్ విభాగాల్లో డైరెక్ట్ నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. జీవో విడుదల చేసిన రోజునుంచి ఇవి అమలులోకి వస్తాయని తెలిపారు. ముందుగా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సీఎస్ దాదాపు మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు.ఆర్థికశాఖ అనుమతినిచ్చిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.