Telangana | హైదరాబాద్ : తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తక్కువ స్కోర్ చేసిన వారి పనితీరును 6 నెలల పాటు పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. ఇక జేపీఎస్ల పనితీరు, ఇతర వివరాలను యాప్లో నమోదు చేయాలని ఆదేశించింది. నియామక ఉత్తర్వులను కూడా నమోదు చేయాలని పేర్కొంది.
పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రతి గ్రామ పంచాయతీకి అధికారిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో కార్యదర్శులను రాతపరీక్ష ద్వారా నియమించింది.