హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్చంద్రశర్మ వెల్లడి
ఢిల్లీకి బదిలీ సందర్భంగా ఘన వీడోలు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తున్నదని, కొత్త జిల్లాల్లో కోర్టులకు, పలు న్యాయాధికారుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం మరువలేనిదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, కొత్త జిల్లాల్లో కోర్టులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించిందని పేర్కొన్నారు. 779 అదనపు పోస్టులు మంజూరు చేసిందని కొనియాడారు. ఇందుకు అనాటి రిజిస్ట్రార్ జనరల్, నేడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున చేసిన కృషి కొనియాడదగినదని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన సందర్భంగా ఆయనకు గురువారం హైకోర్టులో ఘనంగా వీడోలు సభ జరిగింది. న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్కోర్టులో ఆయన ప్రసంగిస్తూ, తాను సీజే అయ్యాక కొత్త రెవెన్యూ జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు కావడమే కాకుండా సీజేఐ కృషి ఫలితంగా హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి పెరిగిందని అన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు ఎనలేని కృషి చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్నా తాను మళ్లీమళ్లీ హైదరాబాద్ వస్తూనే ఉంటానని చెప్పారు. విధుల్లో తనకు సహకరించిన సిబ్బంది అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, సీజేగా జస్టిస్ సతీశ్చంద్ర శర్మ మూడున్నర వేల కేసుల్ని పరిషరించారని ప్రశంసించారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చిన జస్టిస్ శర్మది సున్నితమైన మనసని అన్నారు. న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రసంగిస్తూ, మనందరికీ నవ్వుతూ కనిపించే జస్టిస్ శర్మ విధి నిర్వహణలో చాలా సీరియస్గా ఉంటారని చెప్పారు. కార్మికులతో సఫాయి పని చేయించకూడదని, ఇద్దరు కార్మికులు చనిపోయారని వచ్చిన వార్తను చదివి లేఖ రాస్తే.. అదేరోజు దాన్ని పిల్గా మలిచి మృతుల కుటుంబాలకు భరోసా కల్పించేలా జస్టిస్ శర్మ ఉత్తర్వులు ఇవ్వడం ఆయనలోని మానవత్వ కోణాన్ని ఆవిష్కరించే విషయమన్నారు. సీజే వీడోలు సమావేశానికి మితాశర్మ, అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ అశోక్గౌడ్, న్యాయాధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఫుల్ కోర్టు వీడ్కోలు సమావేశం అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ దంపతులను హైకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్గౌడ్, చెంగల్వ కల్యాణ్రావు ఇతరులు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు బుధవారం రాత్రి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మకు వీడోలు విందు ఇచ్చారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారురు. జస్టిస్ సతీశ్చంద్రశర్మ కూడా ఢిల్లీ హైకోర్టు సీజేగా 28న ఉదయం పది గంటలకే ప్రమాణం చేయనున్నారు.