హైదరాబాద్, మార్చి 12 : దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి తెలంగాణ ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ముం దుకు సాగుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఉన్న రిజర్వేషన్ను 3 నుంచి 5 శాతానికి పెంచింది. దివ్యాంగుల సంక్షేమం కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాల పరిధిలోకి రాని కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడానికి రూ.3.50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, దివ్యాంగుల హక్కుల చట్టం, నిబంధనల అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను నియమించారు.
తాజాగా 2016 చట్టాన్ని అనుసరించి వసతి గృహాల్లోని ది వ్యాంగ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను భారీగా పెంచారు. సాధారణ విద్యార్థులకు చెల్లిం చే దానికన్నా 25 శాతం అదనంగా అందజేసేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై దివ్యాంగ విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం 18 వసతి గృహాలను ఏర్పాటు చేశారు. అందులో అంధుల కోసం 6, శారీరక దివ్యాంగుల కోసం 12 వసతి గృహాలు ఉన్నాయి. వాటికి అదనంగా అంధుల కోసం 2, బధిరుల కోసం 3 ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 2,300 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. చార్జీల పెంపుతో వీరందరికీ లబ్ధి చేకూరనున్నది.
ఎక్కడాలేని మొత్తంలో పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా దివ్యాంగుల పింఛన్ల కోసమే రూ.1,800 కోట్లు వెచ్చిస్తున్నది. ఎంతో ఖరీదైన అత్యాధునిక ఉపకరణాలను అందిస్తున్నది. 2016 వికలాంగుల చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. అందులోభాగంగా దివ్యాంగ విద్యార్థులకు చెల్లించే కాస్మెటిక్, మెస్ చార్జీలను కూడా 25 శాతం అదనంగా పెంచింది. దివ్యాంగుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– నాగేశ్వర్రావు, రాష్ట్ర సలహా మండలి మెంబర్, దివ్యాంగుల శాఖ
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. 2016 వికలాంగుల చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాల్లో, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలను కల్పించింది. తాజాగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి మెస్, కాస్మెటిక్ చార్జీలను పెంచింది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
– శైలజ, కమిషనర్, దివ్యాంగుల సంక్షేమశాఖ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
నాది నాగర్కర్నూల్ జిల్లా పెర్కపల్లి మండలం గౌరారం. ముసారాంబాగ్ హాస్టల్లో ఉంటూ ఓయూలో పీజీ చేస్తున్నా. చాలా ఏండ్లుగా కాస్మెటిక్, మెస్ చార్జీలు పెరగకపోవడంతో ఇబ్బందులు పడ్డాం. జేబులో నుంచి ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టీఆర్ఎస్ సర్కారు భారీ మొత్తంలో చార్జీలను పెంచింది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– తిరుపతి, ముసారాంబాగ్, దివ్యాంగ బాయ్స్ హాస్టల్