హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు. అయితే, మూడు సంవత్సరాల్లో పదవీ విరమణ పొందనున్నవారికి బదిలీ నుంచి మినహాయింపునిచ్చారు. ఒకవేళ వారు కోరుకుంటే మాత్రం బదిలీ చేస్తారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఫిబ్రవరి 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. నిర్దిష్ట సర్వీసును ఫిబ్రవరి 1లోపు పూర్తిచేసిన వారిని మాత్రమే పరిగణనలోనికి తీసుకోనున్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి 1 నాటికి ఒక పాఠశాలలో రెండేండ్ల సర్వీసు పూర్తిచేసినవారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు. ఎన్సీసీ ఆఫీసర్స్కు మాత్రం మాన్యువల్ కౌన్సెలింగ్ ఉంటుంది. బాలికల పాఠశాలల్లో మహిళా టీచర్లు లేని సందర్భంలో 50 ఏండ్లు నిండిన పురుష ఉపాధ్యాయులకు అనుమతిస్తారు. ఈ మార్గదర్శకాలను ఉన్నతాధికారుల సూచనల మేరకు సవరించడం లేదా యథావిధిగా ఖరారుచేస్తూ త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నారు.
70% వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, ప్రధానోపాధ్యాయులు/ ఉపాధ్యాయులు లేదా వారి జీవిత భాగస్వామి(స్పౌజ్) క్యాన్సర్, బోన్ టీబీ, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, న్యూరోసర్జరీతోపాటు కొత్తగా మస్యులర్ డిస్ట్రోఫీ, డయాలసిస్ కేసులను ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ కింద అనుమతించారు. డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం గల పిల్లల తల్లిదండ్రులు ప్రిఫరెన్షియల్ క్యాటగిరీ వాడుకోవచ్చు. వీరు జనవరి 1కి ముందు గల తేదీలతో జిల్లా మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొంది ఉండాలి.
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు సెలవులు ఇవ్వొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో డీఈవోలకు ఈ మేరకు సూచించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల నేపథ్యంలో హెచ్ఎంలు, టీచర్లకు సెలవులివ్వొద్దని తెలిపింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సీసీఏ రూల్ 1991 ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
టీచర్ల బదిలీల్లో జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. రెండేండ్ల సర్వీసు స్థానంలో జీరో సర్వీసును చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రేడ్ -2 హెచ్ఎంల పదోన్నతులను ఆఫ్లైన్లో నిర్వహించాలని, వెబ్ ఆప్షన్లలో నాట్ విల్లింగ్ను చేర్చాలని వారు కోరారు.