కొండాపూర్/హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు. వారు అందరికీ చెప్పినట్టుగా భాష, భావం, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో వేదిక మీద ఉన్న మాకందరికీ చెప్పారు. వారి మాటలను గౌరవిస్తున్నాం’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
రాజకీయ నాయకులపై వ్యక్తిగత దూషణలకు వెళ్లనని పరోక్షంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డులు పొందిన ఆరుగురు, పద్మ విభూషన్ పొందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిని ఆదివారం శిల్పకళావేదిక సాక్షిగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో పద్మశ్రీ అవార్డులు పొందిన వారికి రాష్ట్ర ప్రభు త్వం తరఫున రూ.25 లక్షల నగదు సాయాన్ని, ఖర్చుల కోసం నెలకు రూ.25 వేల పింఛను ఇస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు భాష, సం స్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రా వాలని ఆకాక్షించారు. ఈసారి పద్మ అవార్డుల కోసం కేంద్రప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిందని వ్యాఖ్యానించారు. కవులు, కళాకారులు, ప్రతిభావంతులను సన్మాంచుకునే సంప్రదాయం కొనసాగాలని అన్నారు. తన అభిమాన నేత వెంకయ్యనాయుడిని భారత రాష్ట్రపతిగా చూడాలని సీఎం ఆకాంక్షించారు.
వ్యక్తిగత విమర్శలు సరికావు
ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని, నిత్యం దుర్భాషలు పెరిగిపోతున్నాయని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంకయ్యనాయడుతో సహా ఎందరో రాజకీయ మేధావులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. రాజకీయాల్లో మాట పడటం, మాట లు అనడం మంచి పద్ధతి కాదని తెలిపారు. రాజకీయ విమర్శలు నచ్చుతాయి కానీ, వ్యక్తిగత విమర్శలు ఎప్పటికీ నప్పవని వెల్లడించారు. తాను చూసిన రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అంటూ వెంకయ్యనాయుడి రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు ఇస్తామని ప్రకటించటం, వాటిని ప్రజాగాయకుడు గద్దర్ పేరున ఇస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయశిల్పి స్థపతివేలు ఆనందాచారి మా ట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయం గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకుంటున్నదని, రెండో తిరుపతిగా పేరొందిందని ఆనందం వ్యక్తం చేశా రు.
కాగా, పద్మశ్రీ గ్రహీతలు ఆనందాచారి, తం త్రివాద్య కళాకారుడు దాసరి కొండప్ప, హరికథాగాయని ఉమామహేశ్వరి, చిందు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బంజారా భాష లోకి భగవద్గీతను తర్జుమా చేసిన కళాకారుడు కేతావత్ సోమ్లాల్, గ్రంథాలయ వ్యవస్థాపకుడు కూరెళ్ల విఠాలాచార్యను ఘనంగా సన్మానించిన సీఎం.. రూ.25 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
రాజకీయాలంటే దూషణలు కాదు
ప్రస్తుతం రాజకీయాల్లో ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతున్నదని, ప్రజాజీవితంలో ఉన్నవారు విలువలు, ప్రమాణాలు పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ వెంకయ్యనాయుడు సూ చించారు. అసెంబ్లీ సమావేశాలు గలాటాలకు కేంద్రంగా మారాయని చెప్పారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మంచి ప్ర వర్తనతో ఉండాలని సూచించారు.
ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా, బూతులు తిట్టుకోకుండా పాలనపై దృష్టిపెట్టాలని తెలిపారు. బూతులు తిట్టేవారికి పోలింగ్ బూత్లలోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు కళామతల్లికి రెండు కండ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే.. మూడో క న్ను మెగాస్టార్ చిరంజీవి అని ఈ సందర్భంగా ఆయన సేవ, కళను కొనియాడారు.